Friday 17 March 2017

అక్షరపరబ్రహ్మ యోగము

అక్షరపరబ్రహ్మ యోగము, భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

|| 8-1 ||
అర్జున ఉవాచ|
కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ|
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే

అర్జునుడిలా ఆడిగాడు: - పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది?ఆధ్యాత్మం ఏది?కర్మ అంటే ఏమిటి?అధి భూతమని దేనిని అంటారు?ఆది దైవతమని దేనిని అంటారు.

|| 8-2 ||
అధియజ్ఞః కథం కోऽత్ర దేహేస్మిన్మధుసూదన|
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నాడు?నిగ్రహ వంతులచేత మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.

|| 8-3 ||
శ్రీభగవానువాచ|
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: - పరమైనదీ బ్రహ్మము. ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అంటారు.

|| 8-4 ||
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్|
అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం ఆది భూతం. జీవుడు ఆధి దైవతం. జీవుళ్ళలో ఆధి యజ్ఞుణ్ణి నేనే.

|| 8-5 ||
అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః

అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళుతున్నారో, అతడు నాతత్వాన్నే పొందుతాడు. ఇందులో సందేహంలేదు

|| 8-6 |
యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్|
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|

కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.

|| 8-7 ||
తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన చిన నీవు నన్నే పొందుతావు. ఈ విషయంలో సందేహం లేదు.

|| 8-8 ||
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరుకుంటావు.

|| 8-9 ||
కవిం పురాణమనుశాసితార-
మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప-
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్

సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ, సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,

|| 8-10 ||
ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.

|| 8-11 ||
యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే

వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.

|| 8-12 ||
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ|
మూధ్న్యా|ర్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.

|| 8-13 ||
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్|
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని చేరుకుంటాడు.

|| 8-14 ||
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః|
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః

అర్జునా మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను సులభుణ్ణి.

|| 8-15 ||
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్|
నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.

|| 8-16 ||
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున|
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే (పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

|| 8-17 ||
సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః|
రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి తెలిసిన వారు.

|| 8-18 ||
అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే|
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమన బ్రహ్మము లోనే అంతా లీనమై పోతుంది.

|| 8-19 ||
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే|
రాత్ర్యాగమేऽవశః పార్థ ప్రభవత్యహరాగమే

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.

|| 8-20 ||
పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్యక్తాత్సనాతనః|
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.

|| 8-21 ||
అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ

ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన ఆ పరమాత్మ భావమేచేరవలసిన ఉత్తమ మార్గమని ౠషులు చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే, ఆ సర్వోత్తమ స్థానమే నేను.


|| 8-22 ||
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా|
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే లభిస్తాడు.

|| 8-23 ||
యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః|
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ

భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.

|| 8-24 ||
అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్|
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలుఅనే మార్గంలో బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.

|| 8-25 ||
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్|
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

|| 8-26 ||
శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని భావించబడుతున్నాయి. మొదటి దానివలన పునర్జమ కలగదు. రెండవ దాని వలన కలుగుతుంది.

|| 8-27 ||
నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన|
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున

పార్ధా ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి కా.

|| 8-28 ||
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్

వేదాలు, యజ్ఞాలు, తపస్సులుదానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు.

|| 8 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః


అర్జునుడు:
కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.

భగవానుడు:
నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.

మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.
కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.

వేదవేత్తలు,నిష్కాములు కోరుకునేదాన్ని క్లుప్తంగా చెప్తాను.నవద్వారాలను బంధించి,ఇంద్రియనిగ్రహం కల్గి,మనోవృత్తులను నిరోధించి,ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ,నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడు.ఇతర అలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడు తిరిగి ఈ దుఃఖపూరిత అశాశ్వత లోకంలో జన్మించక నన్నే పొందుతాడు.

బ్రహ్మలోకము వరకూ పునర్జన్మ ఉందికానీ నన్నుచేరినవారికి లేదు.బ్రహ్మకు వేయివేయియుగాలు ఒక పగలు,వేయియుగాలు ఒక రాత్రి.అతని పగటి కాలంలో పుట్టిన ప్రకృతి అతని రాత్రికాలంలో లయమవుతుంది.అలానే సకలజీవులు కూడా.ప్రకృతికి అతీతమైన,శాశ్వతమైన పరబ్రహ్మ మాత్రం నశించదు.అదే నా నివాస స్థానం.అది ఇంద్రియాలకు గోచరం కాదు.

సమస్తప్రాణులు ఉన్న,జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తసులభుడు.అగ్ని,జ్యోతి,పగలు,శుక్లపక్షం,ఉత్తరాయణ మార్గాలలో జన్మించినవారు పరబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు.పొగ,రాత్రి,కృష్ణపక్షం,దక్షిణాయనం లలో మరణించినవారు తిరిగి జన్మిస్తారు.ఇవి తెలిసిన యోగి భ్రాంతి చెందడు.కాబట్టి యోగయుక్తుడవై ఉండు.
దీనిని గ్రహించిన జ్ఞాని వేద,యజ్ఞ,జపతపాదుల వలన కలిగే పుణ్యస్థానాన్ని అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు.



1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete