Friday 17 March 2017

సాంఖ్య యోగము

సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగములో కురుక్షేత్రంలో మొహరించిన సేనల వర్ణన, వారిని చూసి అర్జునుని మనస్సు వికలం కావడం, తాను యుద్ధం చేయలేనని అర్జునుడు అనడం చెప్పబడినాయి. అర్జునుని విషాదం ఈ రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం ఆరంభంలో కొనసాగింది. చివరకు అతను నీవు తప్ప నాకు వేరు గతి లేదు. నాకు ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. అని కృష్ణునికి శరణాగతుడై చతికిలపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే ఈ సాంఖ్య యోగము..


అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

|| 2-1 ||
సఞ్జయ ఉవాచ|
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్|
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః

సంజయుడన్నాడు:
ఆ ప్రకారంగా కరుణతో ఆవహింప బడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపుతో, విషాదంలోఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు.

|| 2-2 ||
శ్రీభగవానువాచ|
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్|
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున

శ్రీ భగవానుడన్నాడు:
ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తినీ రెండింటిని చెడగొట్టుతుంది.

|| 2-3 ||
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప

అర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా. క్షుద్రమైన హృదయ దౌబల్యాన్ని విడిచి లేచి నిలబడు.


|| 2-4 ||
అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన

అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను?

|| 2-5 ||
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్

మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.

|| 2-6 ||
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః

ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.

|| 2-7 ||
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్

కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.

|| 2-8 ||
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్

ఇంద్రియాలను దహింపచేసే నాయీశోకాన్ని తగ్గించే దేదో నేను తెలుసుకోలేకుడా ఉన్నాను. భూమిలో ఏకచ్చత్రాధిపత్యం కాని, దేవలోకాధిపత్యం కాని దీనిని తొలగించ లేదు.

|| 2-9 ||
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ

ఓ రాజా. అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చేయనని గోవిందునితో పలికి మాట్లాడకుండా ఊరకున్నాడు.

|| 2-10 ||
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః

భారతా! రెండుసేనల మధ్య విషాదంలో పడిన అతణ్ణి చూసి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు.

|| 2-11 ||
శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః

శ్రీ భగవానుడన్నాడు.
నీవు విచారించదగని వారికోసం విచారిస్తున్నావు. ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు. చనిపోయిన వారి గురించి కానిబతికి ఉన్న వారి గురించి కాని పండితులు శోకించరు.

|| 2-12 ||
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్

నీవుకాని నేను కాని ఈ రాజులు కాని లేని సమయం భూతకాలంలో లేదు, వర్తమానంలో ఉండదు.

|| 2-13 ||
దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి

ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాకలుగుతాయో, అలాగే మరోదేహం లభించడం కూడాను. వివేకి ఈవిషయంలో భ్రమపడడు.


|| 2-14 ||
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత

కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ, సుఖదః ఖాలను కలిగిస్తాయి అవి వస్తూ పోతుంటాయి. నిలకడలేనివి. అర్జునా వాటిని సహించాలి.

|| 2-15 ||
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.

|| 2-16 ||
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః

అసత్యానికి శక్తి లేదు. సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈరెండింటి అసలు స్వరూపం తత్వ జ్ఞానులచేత దర్శింప బడినది.

|| 2-17 ||
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి

దేని చేత ఈప్రపంచం యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు నాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు.

|| 2-18 ||
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత

నిత్యమైన నాశరహితమైన పరిణామాలులేని శారీరా ధారి అయిన ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా యుద్ధం చేయి.

|| 2-19 ||
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే

ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు.

|| 2-20 ||
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే

అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.


|| 2-21 ||
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్

జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆపురుషుడ ఎలా ఎవరిని చంపిస్తాడు? ఎవరిని చంపుతాడు?

|| 2-22 ||
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ

మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలను విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు.


|| 2-23 ||
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః

దీనిని శస్త్రాలు చేదించవు, అగ్ని కాచదు, నీరుతడపదు, గాలి ఎండించదు.


|| 2-24 ||
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయమక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః

ఇది ఛేధించ రానిది, కాల్చ రానిది, తడప రానిది, ఎండించ రానిది. నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది.

|| 2-25 ||
అవ్యక్తోऽయమచిన్త్యోऽయమవికార్యోయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి

ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం విడిచి పెట్టు.


|| 2-26 ||
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి

ఇక దీనిని నిత్యం పుట్టేది, నిత్యం గిట్టేదిగా భావించినా మహానుభావుడా|అప్పుడు కూడా ఇలా విచారించ తగదు.

|| 2-27 ||
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి

పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో, అలాగే చనిపోయిన వారికి జన్మ తప్పదు. అందుచేత శోకింపనవసరం లేని దాని కోసం నీవు శోకింప తగదు.

|| 2-28 ||
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా

అర్జునా జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఎమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పనిలేదు.

|| 2-29 ||
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్

దీనిని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకరు ఆశ్చర్యంగా చెబుతాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు.


|| 2-30 ||
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి

అర్జునా! అన్ని దేహాలలో ఉన్న దేహి నిత్యమైన వాడు కనుక చంపబడడు. అందుచేత ఎవరిని గురించీ నీవు విచారించతగదు.

|| 2-31 ||
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్క్షత్రియస్య న విద్యతే

స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించ తగదు. క్షత్రియుడికి ధర్మ యుద్ధంకన్నామేలైనది లేదు.


|| 2-32 ||
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్

అర్జునా! యాదృచ్చికంగా లభించినదీ స్వర్గద్వారాన్ని తెరిపించేదీ అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు.

|| 2-33 ||
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి

ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో, దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవై పాపం పొందుతావు.

|| 2-34 ||
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే

ప్రజలు నిన్ను అప్రతిష్టకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అపకీర్తి మరణంకంటే బాధాకరం.


|| 2-35 ||
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్

ఈ మహారధులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకనగా చూస్తారు.


|| 2-36 ||
అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్

నీ శత్రువులు నిన్ను గురించి పలురకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్ధతని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా?

|| 2-37 ||
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః

చనిపోయావా, స్వర్గాన్ని పోందుతావు. గెలిచావా, రాజ్యాన్ని అనుభవిస్తావు. అందు చేత లే కౌంతేయ; యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడువై లేచి నిలబడు.


|| 2-38 ||
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి

సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా. ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు.


|| 2-39 ||
ఏషా తేభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి

ఇంతవరకు నీకు జ్ఞానాన్ని భోదించడం జరిగింది. ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి వినుము. పార్ధుడా; ఈ జ్ఞానం తోడూ ఉంటే కర్మ బంధాన్ని ఛేదిస్తావు.


|| 2-40 ||
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్

ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ విపరీత ఫలితాలు కానీ ఉండవు. ఈ ధర్మం ఏకొంచం ఆచరించినా భయం నుండి రక్షిస్తుంది.

|| 2-41 ||
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోऽవ్యవసాయినామ్

కురునందనా! ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి.


|| 2-42 ||
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః

అర్జునా; అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.


|| 2-43 ||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి

కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైస్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.

|| 2-44 ||
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే

భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్ఛయ జ్ఞానం ఏర్పడదు

|| 2-45 ||
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్

అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి నీవు వాటికి అతీతుడైనై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యముశుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను నర్జించి(వదిలి), ఆత్మజ్ఞానివి కా.


|| 2-46 ||
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః

అంతటా జలం పొంగుతున్నప్పుడు జలకాల శాల ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.

|| 2-47 ||
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోస్త్వకర్మణి

కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.

|| 2-48 ||
యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ|
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

ధనంజయా! యోగంలో నిలిచి, సగం వదిలి, కర్మఫలితాలు సిద్ధించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది.

|| 2-49 ||
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ|
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః

ధనంజయా! సమత్వ బుద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్ప మైనది. కాబట్టి ఆసమ బుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యేవారు పిసిని గొట్టులు.

|| 2-50 ||
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే|
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్

సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలని రెంటినీ వదులుతాడు. అందుచేత నీవు యోగంకోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే.

|| 2-51 ||
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్

సమబుద్ధితో కర్మనుండి జనించే ఫలితమునందు ఆసక్తి త్యజించే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు.

|| 2-52 ||
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ

ఎప్పుడు నీబుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో, అప్పుడు వినదగిన, వినిన విషయాలనుండి విముక్తుడివి అవుతావు.


|| 2-53 ||
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి

విన్నవాటితో వేసారిపోయిన నీబుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నీవు యోగాన్ని పొందుతావు.

|| 2-54 ||
అర్జున ఉవాచ|
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్

అర్జునుడు ఇలా అడిగాడు: కేశవా సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు?


|| 2-55 ||
శ్రీభగవానువాచ|
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే

భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడుఇక్కడమనస్సు ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే సత్యాన్ని లేదా సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చుసమాధి స్థితి సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు.మనస్సు నిశ్చలంగా, స్థిరంగా మనస్సునిలుకడ తెలియర గురువు అనుగ్రహంవల్ల సూక్ష్మత తత్త్వాన్ని… సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం.

|| 2-56 ||
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే

ధుఃఖాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలకోసం తహతహ పడనివాడు, రాగ భయ, క్రోదాలని విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు.

|| 2-57 ||
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఎక్కడా దేనికీ తగుల్కోకుండా, శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచివుంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది.

|| 2-58 ||
యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

తాబేలు తన అంగాలను ఉప సంహరించు కున్నట్లుగా, ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువులనుండి ఎప్పుడు ఉప సంహరించు కుంటాడో అప్పుడు అప్పుడు ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది.


|| 2-59 ||
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే

ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుడి నుండి విషయ వస్తువులు దూరంగా పోతాయి. కాని, అభిరుచి అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది.


|| 2-60 ||
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః

అర్జునా! పండితుడి ఇంద్రియాలు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనస్సును విషయాల మీదికి లాగి వేస్తాయి కదా;


|| 2-61 ||
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

వాటినన్నింటిని బాగా నిగ్రహించి, యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది.

|| 2-62 ||
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోభిజాయతే

విషయధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం వలన కామము, కామం వలన క్రోధం జనిస్తాయి.


|| 2-63 ||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి

క్రోధం వలన విభ్రాంతి కలగుతుంది. విభ్రాంతితో మతిమరపు, దానితో బుద్ధి నాశనం కలిగి, బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు.

|| 2-64 ||
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి

రాగద్వేషాలనుండి విడివడి, స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు.

|| 2-65 ||
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే

మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్నచిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది.

|| 2-66 ||
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్

నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడుకానివానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేనివాడికి సుఖమెక్కడ?

|| 2-67 ||
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి

ఏమనస్సు సంచరించే ఇంద్రియాలకు లోబడి వాటిననుసరిస్తుందో, అది నీటిలో పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి వేస్తుంది.

|| 2-68 ||
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

అందు వలన ఓ మహానుభావుడా! ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో, అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.

|| 2-69 ||
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః

అందరికి ఏది రాత్రియో, సంపూర్ణ నిగ్రహ వంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి.

|| 2-70 ||
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ

పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్ళు ఎలాచేరుకుంటాయో, ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమౌతాయో, శాంతిని పొందుతాడు. కోరికలకు దాసుడైనవాడు పొందలేడు.

|| 2-71 ||
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి

అన్ని కోరికలను వదిలి, అహంకార మమకారాలు వీడి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు.


|| 2-72 ||
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి

ఆర్జునా ఇదే బ్రాహ్మీస్థితి, దీనిని పొందాక ఇక భ్రమించడు. ఇందులోచివరి సమయంవరకు నిలిస్తేబ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు.


|| 2 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః


అధ్యాయ సంగ్రహం:

అర్జునుని శరణాగతి:
అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు. కాని అర్జునుడు "నేను గురువులను, పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను. అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా. నాకు దుఃఖం ఆగడం లేదు. నేను నీ శిష్యుణ్ణి. నాకేది మంచిదో నీవే చెప్పు" అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో "దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు. తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని, వర్తమానం గురించికాని బాధపడరు. అయినా నేను, నువ్వు, ఈ రాజులు గతంలోనూ ఉన్నాము. భవిష్యత్తులోనూ ఉంటాము. బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే. సుఖదుఃఖాలు శాశ్వతం కావు. ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు.

ఆత్మ లక్షణాలు:
దేహం అనిత్యం, కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించినా ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కాని, చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు. ఇది సనాతనము అనగా ఎప్పుడు ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్నికాని, గాలి కాని, నీరు గాని మరియు ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావక తప్పదు. మరలా పుట్టక తప్పడు. దీనికి బాధపడనవసరం లేదు. అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.

విద్యుక్త ధర్మ నిర్వహణ:
క్షత్రియులకు యుద్దధర్మం శ్రేష్ఠం. నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనంచే చేయలేదని అనుకుంటారు. అపకీర్తి వస్తుంది. అమర్యాద పాలవుతావు. శత్రువులు చులకన చేస్తారు. మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖదుఃఖాలను, జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.

నిష్కామ కర్మ:
ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచం ఆచరించినా గొప్పఫలితాన్ని ఇచ్చి సంసారభయాన్ని దాటగలవు. ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏక కారణంగా ఉంటుంది. కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానంకాని, బుద్ధికాని లేక జననమరణాలు పొందుతుంటారు. ప్రకృతి యొక్క మూడుగుణాలకు అతీతుడవై, సుఖదుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి. బావితో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి, జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది. పని చెయ్యి. కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు. అలా అని పని చేయడం ఆపకు.జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగిఉండు. ఈ బుద్ది కలిగినవారు పాపపుణ్యాలు నశింపచేసుకుని మోక్షము పొందుతారు. నీ మనసు స్థిరం కావాలి.

స్థితప్రజ్ఞుడి లక్షణాలు:
అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు, నడవడిక గురించి అడుగగా కృష్ణుడు "అన్ని కోరికలను వదిలి, దుఖానికి కలత పొందక, సుఖానికి పరవశించక, అనురాగము, కోపము, భయములను వదిలివేసి తన ఆత్మ యందె సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడుతాడు" అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది. విషయాలను గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి, అది నెరవేరకపోవడం వలన కోపం, ఆ కోపం వలన అవివేకం, అవివేకం వలన యుక్తాయుక్తజ్ఞానం, బుద్ధి నశించి అథోగతిపాలవుతాడు.

విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం, కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు. నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అదిలేనివాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలందు నిద్రతోను, సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.

బ్రాహ్మిస్థితి:
సముద్రంలోకి ఎన్ని నీళ్ళు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా, గంభీరంగా చెలియలికట్ట దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని, కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మిస్థితి అంటారు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే పొందగలడో అతడే బ్రహ్మనిర్వాణపదాన్ని పొందుతాడు.



1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete